శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అతితక్కువ ఖర్చుతో రూపొందించిన ఎస్ఎస్ఎల్వీ -డీ1 రాకెట్ ప్రయోగంపై సందిగ్ధత నెలకొన్నది. ఎస్ఎస్ఎల్వీ రాకెట్ను ఆదివారం ఉదయం 9.18 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో ప్రయోగించింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన వాహక నౌక మూడు దశలను విజయంవంతంగా పూర్తిచేసుకున్నది. మూడోదశలో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే సాంకేతిక సమస్యలతో ఉపగ్రహాల నుంచి షార్కు సిగ్నల్స్ అందకపోవడంతో రాకెట్ ప్రయోగంపై సందిగ్ధత ఏర్పడింది.
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. అనుకున్న విధంగానే మూడు దశల ప్రయోగాలు పూర్తయ్యాయని చెప్పారు. అయితే తుదిదశ సమాచార సేకరణలో కొంత ఆలస్యమయిందని వెల్లడించారు. ప్రయోగ పురోగతిపై వీలైనంత త్వరగా సమాచారం అందిస్తామన్నారు. సమాచార విశ్లేషణలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారని వెల్లడించారు. ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించాయా లేదా అని విశ్లేషిస్తున్నామని చెప్పారు.