న్యూఢిల్లీ: సబర్మతి ఆశ్రమం పునరాభివృద్ధిని వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ మనువడు తుషార్ గాంధీ, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జాతి పిత సిద్ధాంతాలకు ప్రతిరూపంగా నిల్చిన ఆశ్రమం భౌతిక నిర్మాణాన్ని మార్చి, దాని సహజత్వాన్ని పాడుచేసి తిరిగి అభివృద్ధి చేయాలన్న గుజరాత్ ప్రభుత్వ ప్రతిపాదనను రద్దు చేయాలని కోరారు. సబర్మతి ఆశ్రమం పునరాభివృద్ధి ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) గుజరాత్ హైకోర్టు గత ఏడాది నవంబర్ 25న కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టులో తుషార్ గాంధీ సవాల్ చేశారు.
సబర్మతి ఆశ్రమాన్ని ప్రపంచస్థాయి మ్యూజియం, పర్యాటక గమ్యంగా మార్చడానికి దానిని రీడిజైన్, రీడెవలప్ చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం 2019లో ఉత్తర్వు జారీ చేసిందని తుషార్ గాంధీ తన పిటిషన్లో తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రకారం 40 పురాతన కట్టడాలను మాత్రమే ఉంచి మిగతావైన సుమారు 200 నిర్మాణాలను కూల్చనున్నారని చెప్పారు. పార్కులు, పార్కింగ్ స్థలం, ఫలహారశాల, చంద్రభాగ నది ప్రవాహ పునరుద్ధరణ వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయని అన్నారు. గాంధీ సిద్ధాంతాలకు ప్రతిరూపంగా నిల్చిన సబర్మతి ఆశ్రమం స్వరూపాన్ని, సహజత్వాన్ని ఈ పునరాభివృద్ధి ప్రాజెక్టు దెబ్బతీస్తుందని ఆయన ఆరోపించారు. అంతేగాక సబర్మతి ఆశ్రమం పూర్తి వాణిజ్య, వినోదాత్మక కాంప్లెక్స్గా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, తుషార్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం పరిశీలించింది. తుషార్ తరుఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టుకు హాజరయ్యారు. ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరుపాలని కోరారు. దీంతో ఏప్రిల్ 1న విచారణకు లిస్ట్ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి ఎన్ రమణ హామీ ఇచ్చారు. తుషార్ గాంధీ దాఖలు చేసిన అప్పీల్లో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతివాదులుగా ఉన్నాయి.