ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఇండియా, పాకిస్థాన్ లాంటివి కావని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ను శనివారం తాను కలిసినట్లు చెప్పారు. ఆయనతో కలిసి బహిరంగంగానే టీ తాగానన్నారు. తమ ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ తాము స్నేహపూర్వకంగా ఉన్నామని తెలిపారు. తనను ఇష్టపడని వ్యక్తులు అసెంబ్లీ సమావేశానికి ముందే దీనిపై పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఇలాంటి పుకార్లు ఎంత బాగా వ్యాపిస్తే మహా వికాస్ కూటమి ప్రభుత్వం అంత దృఢంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. సాధారణ ప్రజల సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరుపడానికి సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అంతరాయం లేకుండా జరిగేలా చూడాలని బీజేపీని కోరారు.