ముంబై : మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారినపడ్డ తొలి వ్యక్తి కోలుకున్నాడు. బుధవారం నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్గా తేలడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. థానే జిల్లాకు చెందిన 33 సంవత్సరాల వ్యక్తి వృత్తిరీత్యా మెరైన్ ఇంజినీర్. కల్యాణ్లోని డోంబివిలి మున్సిపల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గత నెల 24న దక్షిణాఫ్రికా నుంచి దుబాయి మీదుగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
అక్కడ అతనికి కొవిడ్ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ముంబైకి బయలుదేరాడు. అక్కడికి చేరుకోగానే పరీక్షలు పాజిటివ్గా వచ్చినట్లు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు తెలిపారు. దీంతో మహారాష్ట్రలోని ఆరోగ్యశాఖ అధికారులు అతని స్వాబ్ నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా.. ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారించారు. సదరు వ్యక్తి ఏప్రిల్లో ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన షిప్లో చేరాడు. అప్పటి నుంచి సముద్ర ప్రయాణంలో ఉండగా.. కొవిడ్ టీకా తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు.
కల్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) కమిషనర్ డాక్టర్ సూర్యవంశీ విలేకరులతో మాట్లాడుతూ మహమ్మారి బారినపడ్డ సదరు వ్యక్తిని కల్యాణ్లోని కొవిడ్ కేర్ సెంటర్లో చేర్చామన్నారు. బుధవారం చేసిన పరీక్షలు నెగెటివ్ రావడంతో డిశ్చార్జి చేసినట్లు చెప్పారు. నిబంధనల మేరకు సదరు వ్యక్తిని వారం రోజులు హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు. అయితే, రోగిని డిశ్చార్జి చేసిన రోజు అతని పుట్టిన రోజని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 10 ఓమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.