ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 34 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 5.6 లక్షలు దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు రికార్డుస్థాయిలో కొత్తగా 63,294 కరోనా కేసులు, 349 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,07,245కు, మరణాల సంఖ్య 57,987కు చేరింది. అలాగే ముంబైలో ఆదివారం రికార్డు స్థాయిలో 9,989 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి.
మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 34,008 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 27,82,161కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,65,587 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలి స్థానంలో కొనసాగుతున్నది.