ముంబై: మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 127 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శనివారంతో పోల్చితే అదనంగా 30 కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసుల నమోదు పెరుగుతున్నది. ఆదివారం 21,534 నమూనాలను పరీక్షించారు. 127 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఒక్క ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే 80 కేసులు నమోదయ్యాయి. పూణే డివిజన్లో 34 కేసులు, నాసిక్, లాతూర్, కొల్హాపూర్ డివిజన్లలో నాలుగు చొప్పున, నాగ్పూర్ డివిజన్లో ఒక కేసు నమోదయ్యాయి.
దీంతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల మొత్తం సంఖ్య 79 లక్షలకు చేరింది. ఇందులో 77,27,372 మంది కోలుకున్నారు. అయితే గత 24 గంటల్లో ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదు. మరోవైపు కరోనా కేసుల నమోదు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నియంత్రణ చర్యలపై దృష్టిసారించింది.