ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనాతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 12,160 కరోనా కేసులు, 68 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా రోగులు మరణించారు. ఒక్క ముంబైలోనే కొత్తగా 7,928 కరోనా కేసులు, 40 ఒమిక్రాన్ కేసులు, రెండు మరణాలు వెలుగుచూశాయి. పూణేలో 17, నాగ్పూర్లో నాలుగు, పన్వెల్లో మూడు, నవీ ముంబై, రాయ్గఢ్, సతారా, కొల్హాపూర్లో ఒక్కో ఒమిక్రాన్ కేసును గుర్తించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కి చేరింది. వీరిలో 259 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. కాగా, మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,12,028కి చేరింది. ప్రస్తుతం 52,422 యాక్టివ్ కరోనా కేసులున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు.