ముంబై: మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 23 కేసులు నమోదయ్యాయి. ఒక్క పూణేలోనే 13 కేసులను గుర్తించారు. ముంబైలో ఐదు, ఉస్మానాబాద్లో రెండు, థానే, నాగ్పూర్, మీరా-భయందర్లలో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 88కు చేరింది.
ఇందులో 42 మంది ఒమిక్రాన్ రోగులకు చికిత్స తర్వాత నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో కొత్తగా 1,179 కరోనా కేసులు, 17 మరణాలు నమోదైనట్లు చెప్పారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,53,345కు, మొత్తం మరణాల సంఖ్య 1,41,392కు చేరినట్లు వెల్లడించారు.
మరోవైపు మహారాష్ట్రలో ఒమిక్రాన్ విజృంభణపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే సమీక్షించనున్నారు. గురువారం రాత్రి పది గంటలకు కోవిడ్ టాస్క్ ఫోర్స్తో వర్చువల్గా సమావేశమవుతారని సీఎం కార్యాలయం పేర్కొంది.