ముంబై: భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తున్నది. దీంతో ఎక్కడ చూసిన వరదలు ముంచెత్తాయి. ఎడతెరపి లేనివానలతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 136 మంది మృతిచెందారు. రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం వరకు భారీ వర్షాలకు వరదలు సంభవించడం, కొండ చరియలు విరిగిపడటంతో 136 మంది మరణించారని సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వాడెట్టి తెలిపారు. ఇందులో రాయ్గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో మరణించిన 36 మంది కూడా ఉన్నారని చెప్పారు.
కొంకన్ రీజియన్లోని పలు జిల్లాల్లో గత కొన్నిరోజులుగా భారీవర్షాలు నమోదవుతున్నాయి. దీంతో వేల మంది వరదల్లో చిక్కుకుపోయరని వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు 84 వేల మందిని పునరావాస, సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ఇందులో కొల్హాపూర్కు చెందినవారే 40 వేల మందికిపైగా ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 54 గ్రామాలు పూర్తిగా వరదల్లో మునిగిపోయాయన్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పంచ్గంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్నదని, 2019 తర్వాత ఇంతగా వరదలు సంభవించడం ఇదే మొదటిసారని చెప్పారు.
రాయ్గఢ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 33 మంది మృతదేహాలను వెలికితీశామని, మరో 52 మంది గల్లంతయ్యారని మంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 32 ఇండ్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు.