Maharashtra Political Crisis | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉన్నది. ఓ వైపు అసోంలోని గౌహతిలో శివసేన రెబల్స్ నేత ఏక్నాథ్ షిండే.. ఆయన మద్దతుదారులు ఉద్ధవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విపుతున్నారు. మరో వైపు శివసేన పార్టీ సైతం 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ద్వారా నోటీసులు జారీ చేసింది. దీంతో మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి. ఈ తరుణంలో ఎమ్మెల్యేల తిరుగుబాటు కారణంగా ఉద్ధవ్ సర్కారు కూలిపోతుందా?.. లేక ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా?.. పరిణామాలు ఎలా ఉండబోతున్నాయంటూ ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. అయితే, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఉన్న ఆప్షన్లు ఏంటీ? ఏదైనా కొత్త పార్టీ పెడతారా? లేదంటే బీజేపీలోకి చేరుతారా? అంటూ పలువురు ఆరాలు తీస్తున్నారు.
ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన జాతీయ కార్యనిర్వాహక కమిటీ భేటీ శనివారం భేటీ అయ్యింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏక్ నాథ్ షిండేతో కలిసి తిరుగుబావుటా ఎగరేసిన 38 మంది ఎమ్మెల్యేలపై ఏవిధమైన చర్యలైనా తీసుకునే పూర్తి అధికారాన్ని పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు కట్టబెడుతూ కార్యనిర్వాహక కమిటీ తీర్మానం చేయగా.. పార్టీ పేరును బయటి వ్యక్తులెవరూ వినియోగించకూడదని మరో తీర్మానం చేశారని సమాచారం. అయితే, శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ వర్గానికి ‘శివసేన బాలాసాహెబ్’ అని పేరు పెట్టుకున్న నేపథ్యంలో ఈ తీర్మానాలు ముందుకు వచ్చాయి. అనంతరం జరిగిన పరిణామాల మధ్య 16 మంది ఎమ్మెల్యేలకు డెప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలో ఆ రెబల్స్ ఎమ్మెల్యేల ముందున్న మార్గాలపై అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ స్పందించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు శివసేనపై తమ దావా వేస్తే.. ఈ విషయం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్తుంది. బిహార్లో లోక్జనశక్తి పార్టీ వివాదం సందర్భంలో ఇదే పరిస్థితి చోటు చేసుకున్నది. చిరాగ్ పాశ్వాన్, అతని మామ ఇద్దరూ పార్టీపై తమదే అధికారం అంటూ తెలిపారు. ఈ వ్యవహారం ఈసీ వరకు వెళ్లగా.. చివరకు చిరాగ్ పార్టీ గుర్తును సొంతం చేసుకున్నారు.
శివసేనపై ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించినట్లయితే.. ఎన్నికల కమిషన్ దానిపై నిర్ణయం తీసుకుంటుందని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ చెప్పారు. ఎమ్మెల్యేల సంఖ్య కమిషన్కు పట్టింపు ఉండదని స్పష్టం చేశారు. పార్టీ నియమ నిబంధనల ప్రకారం.. పార్టీలోని ఏ వర్గంలో ఎంత మంది ? జాతీయ కార్యవర్గం ?వ్యవస్థాపక సభ్యులు ఉన్నారో పరిశీలించనున్నట్లు తెలిపారు. ఆధిపత్యం ఉన్న గ్రూప్కే పార్టీ సొంతమవుతుంది.
తిరుగుబాటు ఎమ్మెల్యేలు శివసేనను వీడిన తర్వాత.. వారి హోదా స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉంటుందని అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ తెలిపారు. అలాంటి పరిస్థితిలో వారంతా ఏమైనా చేయవచ్చన్నారు. కొత్త పార్టీని కూడా పెట్టుకోవచ్చన్నారు. ఇంతకు ముందు సమతా పార్టీలో చీలిక కారణంగా జేడీఎస్, జేడీయూ పార్టీలు ఏర్పాటైన విషయం విధితమే.
ఉద్ధవ్ ఠాక్రేపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు జూన్ 21న సూరత్లో క్యాంప్ పెట్టారు. ఈ ఎమ్మెల్యేలకు కేబినెట్ మంత్రి ఏక్నాథ్ షిండే నాయకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత క్యాంప్ను సూరత్ నుంచి గౌహతికి మార్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు శివసేన అధినేత ఆదేశాల మేరకు ముగ్గురు నేతల బృందం గౌహతికి చేరుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలు దిగిరాలేదు. ఆ తర్వాత కరోనా బారినపడ్డ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఫేస్బుక్ లైవ్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
షిండే, ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి కోరినా రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. ఆ తర్వాత సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ను శివసేన కోరింది. దీంతో డిప్యూటీ స్పీకర్ 16 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి, 27లోగా సమాధానమివ్వాలని కోరారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యే శివసేన బాలాసాహెబ్ పేరుతో కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించడం కూడా చర్చనీయాంశమైంది.