ముంబై: సులువుగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన వాళ్లలో ఒక్కొక్కరు ఒక్కో మర్గాన్ని అనుసరిస్తుంటారు. కొందరు దొంగ బంగారాన్ని అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకుంటే, మరికొందరు నిషేధిత మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించి ఆర్జిస్తుంటారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి అరుదైన జాతులకు చెందిన జీవులను రహస్యంగా సరిహద్దులు దాటించి డబ్బు సంపాదిస్తారు.
తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బొరివాలి లింకు రోడ్ సమీపంలో అరుదైన తాబేళ్లను అక్రమంగా తరలిస్తూ ఒక నిందితుడు పట్టుబడ్డాడు. ముంబై పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్ చేసి, అరుదైన జాతికి చెందిన ఆ 20 నక్షత్ర తాబేళ్లను సీజ్ చేశారు. వాటి విలువ సుమారుగా 3.5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.