ముంబై: ఎన్సీబీ జోనల్ అధికారి సమీర్ వాంఖడే, ఆయన కుటుంబంపై డిసెంబర్ 9 వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయనని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మానం హెచ్చరిక నేపథ్యంలో ఈ మేరకు కోర్టుకు భరోసా ఇచ్చారు. మంత్రి నవాబ్ మాలిక్ తమ కుటుంబానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న పోస్టింగ్లపై సమీర్ వాంఖడే తండ్రి ధ్యాన్దేవ్ వాంఖడే రూ.1.25 కోట్లకు పరువునష్టం దావా వేశారు. తమకు వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు, పోస్టులు చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించాలని కోర్టును కోరారు.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్, ధ్యాన్దేవ్ వాంఖడేకు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. సమీర్ వాంఖడే, ఆయన తండ్రి, కుటుంబం గురించిన విషయాలను మాట్లాడే, ప్రచురించే స్వేచ్ఛ మాలిక్కు ఉందని తెలిపింది. అయితే వాస్తవాల ధృవీకరణ తర్వాత మాత్రమే మాలిక్ వ్యాఖ్యలు చేయడం లేదా ప్రచురించడం చేయాలని కోర్టు సూచించింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ ఆదేశాన్ని ధ్యాన్దేవ్ వాంఖడే బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి మాలిక్ తమ కుటుంబంపై విమర్శలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కోర్టు వివరణ కోరగా సమీర్ వాంఖడే, ఆయన కుటుంబంపై డిసెంబర్ 9 వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయనని మంత్రి మాలిక్ స్పష్టత ఇచ్చారు.