ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఏప్రిల్ 18 వరకు పొడిగించింది. సోమవారంతో రిమాండ్ ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయనను ముంబై ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు వారాలకు పొడిగించింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసుపై దర్యాప్తు చేస్తున్న ఈడీ, మంత్రి నవాబ్ మాలిక్ను ఫిబ్రవరి 23న అరెస్ట్ చేసింది. తొలుత ఆయన ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు పలు గంటలపాటు ప్రశ్నించారు. అనంతరం అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
ఆ తర్వాత ఈడీ ప్రత్యేక కోర్టులో నవాబ్ మాలిక్ను హాజరుపర్చారు. 14 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఈడీ కోరింది. అయితే తొలుత మార్చి 3 వరకు ఈడీ రిమాండ్కు కోర్టు అంగీకరించింది. ఆ తర్వత మరోసారి ఈడీ కస్టడీని పొడిగించింది. ఈడీ కస్టడీ ముగిసిన నాటి నుంచి నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. తాజాగా దీనిని ఏప్రిల్ 18 వరకు ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు పొడిగించింది.
మరోవైపు అరెస్ట్ నేపథ్యంలో నవాబ్ మాలిక్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని మహారాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది. దీనిపై నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆయన ఫోర్ట్ ఫోలియోను మార్చాలని ఎన్సీపీ భావించింది. అయితే మాలిక్ ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చేయబోరని ఎన్సీపీ స్పష్టం చేసింది. దీంతో నవాబ్ మాలిక్ అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నప్పటికీ మంత్రి పదవిని వీడలేదు. కాగా, తన అరెస్ట్ అక్రమమన్న ఆయన, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని గతంలోనే ప్రకటించారు.