ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను మార్చి 3 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి కోర్టు అప్పగించింది. ముంబై ప్రత్యేక కోర్టు ఈ మేరకు పేర్కొంది. ఎన్సీపీ సీనియర్ నేత అయిన 62 ఏండ్ల నవాబ్ మాలిక్ ఇంటికి బుధవారం ఉదయం ఈడీ అధికారులు వెళ్లారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసుపై పలు గంటలపాటు ఆయనను ప్రశ్నించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
అరెస్ట్ తర్వాత మంత్రి నవాబ్ మాలిక్ను ఈడీ అధికారులు బుధవారం మధ్యాహ్నం జేజే ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిబంధనల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఈడీ ప్రత్యేక కోర్టులో ఆయనను ప్రవేశపెట్టారు. కాగా, 14 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఈడీ కోరింది. అయితే వారం రోజులపాటు అంటే మార్చి 3 వరకు ఈడీ రిమాండ్కు కోర్టు అంగీకరించింది. ఆ రోజున మాలిక్ను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని పేర్కొంది. దీంతో అధికారులు ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు.