ముంబై: మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా (Navneet Rana) బీజేపీలో చేరింది. అమరావతి ఎంపీ అయిన ఆమె బుధవారం రాత్రి నాగ్పూర్లో బీజేపీ రాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే, ఇతర నేతల సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వం తీసుకుంది. ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణా కూడా ఆమె వెంట ఉన్నారు. అమరావతి లోక్సభ స్థానం అభ్యర్థిగా ఆమె పేరును బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 4న ఆమె నామినేషన్ దాఖలు చేస్తానని చంద్రశేఖర్ తెలిపారు.
కాగా, నవనీత్ రాణా, 2014లో తొలిసారి ఎన్సీపీ టికెట్పై అమరావతి నుంచి పోటీ చేసింది. శివసేనకు చెందిన ఆనందరావు అద్సుల్ చేతిలో ఆమె ఓడిపోయింది. 2019లో ఎన్సీపీ మద్దతుతో ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆమె ఆనందరావును ఓడించింది. అయితే అనంతరం బీజేపీకి ఆమె మద్దతిచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పఠనం వివాదం నేపథ్యంలో అరెస్టైన నవనీత్ రాణా జైలుకు కూడా వెళ్లింది.
మరోవైపు నవనీత్ రాణా మోసపూరితంగా, నకిలీ పత్రాలతో ‘మోచి’ కుల ధృవీకరణ పత్రం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2021లో ఆమె కుల ధృవీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. రూ.2 లక్షల జరిమానా కూడా విధిచింది. అయితే బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నవనీత్ రాణా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై తీర్పును గత నెలలో సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.