ముంబై : మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలపై రచ్చ మహారాష్ట్రలో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. తాజాగా వ్యవహారంతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 26/11 ముంబై ఉగ్రదాడులు జరిగి నేటికి 14 సంవత్సరాలు గడించింది. దేశ చరిత్రలో చీకటిరోజని చెప్పే విషాదఘటనలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది, పౌరులకు దక్షిణ ముంబైలోని పోలీస్ కమిషన్ కార్యాలయంలోని స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు.
గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, పలువురు పోలీస్ అధికారులు ఘన నివాళులర్పించారు. అయితే, నివాళులర్పించే సమయంలో కాళ్లకు చెప్పులు ధరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. గవర్నర్ చెప్పులు ధరించి అమరవీరులకు నివాళులర్పించి.. వారిని అవమానించారని కాంగ్రెస్ విమర్శించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ గవర్నర్పై మండిపడ్డారు. ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. నివాళులర్పించే సమయంలో చెప్పులు, బూట్లు తీయడం భారతదేశ సంస్కృతి.. ఇది ఖచ్చితంగా ఇది మహారాష్ట్రదేనని.. సంస్కృతిని, మహానుభావులను పదేపదే అవమానించే గవర్నర్.. అమరవీరులను అగౌరపరిచినప్పుడు సీఎం మహారాష్ట్ర సంస్కృతిని గుర్తు చేసి ఉండి ఉంటే బాగుండేదని చురకలంటించారు.
అయితే, విమర్శలు వెల్లువెత్తడంతో ఈ వ్యవహారంపై రాజ్భవన్ స్పందించింది. అమరవీరులకు నివాళులర్పించేందుకు కమిషనర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు.. చెప్పులు తీయాల్సిన అవసరం లేదని సీనియర్ పోలీస్ అధికారి చెప్పినట్లు రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల శివాజీ పై చేసిన వ్యాఖ్యలపై ఓ వైపు దుమారం కొనసాగుతుండగానే.. మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పాతకాలం నాటి వారికి ఆదర్శమని.. ఇప్పుడు అంబేద్కర్, నితిన్ గడ్కరీ వంటి వారు ఆదర్శమని కామెంట్ చేయగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. గవర్నర్ను తప్పించాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి.
अभिवादन करताना पादत्राणे बाजूला काढून ठेवणे ही भारताची संस्कृती आहे. महाराष्ट्राची तर आहेच आहे. सातत्याने महाराष्ट्राची संस्कृती व महापुरुषांचा अनादर करणारे राज्यपाल हुतात्म्यांचाही अनादर करत असताना मुख्यमंत्र्यांनी महाराष्ट्राच्या संस्कृतीची आठवण करून दिली असती तर बरे झाले असते pic.twitter.com/7Ujwgtuv4x
— Sachin Sawant सचिन सावंत (@sachin_inc) November 26, 2022