న్యూఢిల్లీ: నృత్యంలో ఒక భారత విద్యార్థిని గిన్నిస్ రికార్డును సాధించింది. కథక్ను 127 గంటల పాటు నృత్యం చేసింది. అత్యంత దీర్ఘ సమయం డాన్స్ చేసిన వ్యక్తిగా గత గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టింది. మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన 16 ఏండ్ల శృతి సుధీర్ జగతప్ తన కథక్ నృత్యంలో యోగ నిద్రను సంయోగం చేసి ఈ ఫీట్ సాధించింది. తన కాలేజీ ఆడిటోరియాన్నే వేదికగా ఎంచుకున్న శృతి గతంలో నేపాలీ డాన్సర్ బందనా 2018లో స్థాపించిన 126 గంటల రికార్డును బ్రేక్ చేసింది. మే 29న తన నృత్యాన్ని ప్రారంభించి ఈ రికార్డు సాధించింది. ఈ నృత్యం ద్వారా భారత సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటిచెబుతానని పేర్కొంది.