ముంబై: మహారాష్ట్రలో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకింది. దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి తిరిగి వచ్చిన 37 ఏండ్ల వ్యక్తి, అమెరికా నుంచి తిరిగి వచ్చిన 36 ఏండ్ల అతడి స్నేహితుడికి ఒమిక్రాన్ పాజిటివ్గా సోమవారం నిర్ధారణ అయ్యింది. ఎలాంటి లక్షణాలు లేని వారిద్దరూ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పదికి చేరినట్లు పేర్కొంది.
మరోవైపు దేశంలో ఒమిక్రాన్ మొత్తం కేసుల సంఖ్య 23కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 17 కేసులు వెలుగుచూశాయి. ఇందులో 9 కేసులు రాజస్థాన్లో నమోదవ్వగా.. 7 కేసులు మహారాష్ట్రలోని పూణే జిల్లాలో రికార్డు అయ్యాయి. అంతకుముందు కర్ణాటకలో రెండు, గుజరాత్లో ఒకటి, ఢిల్లీలో ఒక కేసు బయటపడ్డాయి.
తాజాగా సోమవారం ముంబైలో మరో ఇద్దరికి నిర్ధారణ కావడంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి పెరిగింది. దీంతో ఈ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పుపై ఆందోళన వ్యక్తమవుతున్నది.