Ajit Pawar | రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని మహారాష్ట్ర (Maharashtra) ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే తమ వర్గం బీజేపీ (BJP), సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన కూటమి ప్రభుత్వంలో చేరిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి (Mahayuti) కూటమిలో ఉన్నప్పటికీ అన్ని కులాలు, మతాల ప్రజలకు సమన్యాయం చేయడం మా కర్తవ్యమని వెల్లడించారు. రైతులకోసం ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. గతంలో తాను జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేశానని గుర్తుచేశారు. గత నెల ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్.. సీఎం షిండే నేతృత్వంలోని శివసే, బీజేపీ ప్రభుత్వంలో చేరడం, వెంటనే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. దీంతో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (NCP) రెండు వర్గాలు చీలిపోయింది.
అయితే, రెండు రోజులక్రితం శరద్ పవార్ (Sharad Pawar) విలేకరులతో మాట్లాడుతూ.. అజిత్ పవార్ తమ పార్టీకి చెందిన నేతే అని, పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో విడిపోతే దాన్ని చీలిక అంటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీలేదన్నారు. అయితే, కొద్దిగంటలకే పవార్ మాటమార్చారు. అజిత్ పవార్ తమ నాయకుడని అనలేదని, అజిత్ పవార్కు సుప్రియ చెల్లెలు కాబట్టి అలా అని ఉండొచ్చన్నారు. ఇందులో రాజకీయ అర్థాలు వెతకాల్సిన అవసరం లేదని చెప్పారు. శరద్ వ్యాఖ్యల నేపథ్యంలో అజిత్ చేసిన వ్యాఖ్యలు పమహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన్యత సంతరించుకున్నాయి.