ముంబై, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గమే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ గురువారం ప్రకటించారు. ఎన్సీపీలోని 53 మంది ఎమ్మెల్యేలలో 41 మంది మద్దతు అజిత్ పవార్ గ్రూపునకు ఉందని పేర్కొన్నారు. అసలైన రాజకీయ పార్టీని నిర్ణయించడానికి ప్రామాణికం శాసనసభలో మెజారిటీ మాత్రమేనని చెప్పారు.
అంతర్గత అసమ్మతి గళాన్ని నొక్కేయడానికి రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల నిబంధనలను ప్రయోగించరాదని పేర్కొన్నారు. ఎదుటి పక్షంలోని ఎమ్మెల్యేలను శాసన సభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించాలని ఇరు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చారు. ఎన్నికల కమిషన్ కూడా, అజిత్ వర్గమే అసలైన ఎన్సీపీ అని గత వారం ప్రకటించింది. శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియ సూలే స్పందిస్తూ, మహారాష్ట్రలోని రెండు ముఖ్యమైన పార్టీలను అంతం చేయడానికి ఓ అదృశ్య శక్తి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.