తమ రాష్ట్రంలో సరిహద్దు జిల్లాల్లోని గుజరాత్ ఓటర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసింది. గుజరాత్కు చెందిన చాలామంది మహారాష్ట్ర సరిహద్దులోని పల్ఘార్, నాసిక్, నందుర్బర్, ధూలే జిల్లాల్లో పనిచేస్తుంటారు. దాంతో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు పెయిడ్ హాలిడే ప్రకటించింది. ఆయా జిల్లాల్లోని ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు ఎన్నికలు జరిగే రోజు సెలవు ఇవ్వాలని లేదా పని వేళల నుంచి రెండు గంటలు మినహాయింపు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. గుజరాత్లో 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1, డిసెంబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8వ తేదీన ఓట్లు లెక్కింపు ఉంటుంది. దాంతో ఆ ఎన్నికల్లో వాళ్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గుజరాత్లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈసారి గుజరాత్లో అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ మొదటిసారి పోటీ చేయనుంది. ఆ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదాన్ గధ్వీ పేరును ఇప్పటికే ప్రకటించింది.