Maharashtra Political Crisis | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (MVA) కూటమి ప్రభుత్వాన్ని కూల్చే దిశగా తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష బీజేపీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేయగా.. సుప్రీం కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు బీజేపీతో పాటు తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో త్వరలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు సమాచారం.
ఇందులో బీజేపీతో పాటు షిండే వర్గానికి చెందిన మంత్రులుగా బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ, శివసేన తిరుగుబాటునేత షిండే వర్గం మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అయితే, మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రుల జాబితాతో ఢిల్లీకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అగ్రనేతలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో 29 మంది బీజేపీకి చెందిన, 13 మంది ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన వారు మంత్రులుగా ఉండనున్నారు. షిండే వర్గానికి ఎనిమిది కేబినెట్ మంత్రి పదవులు, ఐదుగురికి రాష్ట్రమంత్రులుగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
కొత్త ప్రభుత్వంలో శివసేన తిరుగుబాటు నేత షిండే వర్గానికి 13 మంత్రి పదవులు దక్కనున్నాయి. ప్రస్తుతం ఆయన గ్రూప్లో స్వతంత్రులతో కలిపి 39 మంది మద్దతు ఉన్నది. అయితే, ఇందులో ఏకనాథ్ షిండే, దాదా భూసే, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్, గులాబ్రావ్ పాటిల్, రాజేంద్ర పాటిల్, బచ్చు కడు, సందీపన్ బుమ్రే, ప్రకాష్ అబిద్కర్, ఉదయ్ సమంత్, సంజయ్ రాముల్కర్, శంభురాజ్ దేశాయ్, సంజయ్ శిర్సత్కు మంత్రి పదవులు కేటాయించనున్నట్లు సమాచారం. షిండే, ఉదయ్ సమంత్, దాదా భూసే, గులాబ్రావ్ పాటిల్, దీపక్ కేసర్కర్కు కేబినెట్ మంత్రులుగా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. అయితే, షిండే వర్గానికి డిప్యూటీ సీఎం పదవికి కోసం డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, దీనిపై ఇంకా అంగీకారం కుదరలేదని తెలుస్తున్నది.