ముంబై : సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మహావికాస్ అఘాడి ప్రభుత్వం గవర్నర్కు పంపిన 12 మంది ఎమ్మెల్సీల జాబితాను ఉపసంహరించుకోగా.. ఇందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. షిండే ప్రభుత్వం కొత్త జాబితాను మళ్లీ రాజ్భవన్కు పంపనున్నది. 2020లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం గవర్నర్ కోటా కింద.. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ చేస్తూ 12 మంది జాబితాను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆమోదం కోసం పంపింది.
ఆ తర్వాత ఆ జాబితాను గవర్నర్ ఆమోదం తెలుపకుండా పెండింగ్లో పెట్టారు. ఇటీవల శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో రెబల్స్ నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గత ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీల జాబితాను సీఎం వెనక్కి తీసుకున్నారు. ఈ జాబితాలో శివసేన కోటా నుంచి బాలీవుడ్ నటి ఊర్మిల మంటోడ్కర్, విజయ్ కరంజ్కర్, నితిన్ బానుగ్డే పాటిల్, చంద్రకాంత్ రఘువంశీ పేర్లున్నాయి.
ఎన్సీపీ కోటా నుంచి ఏక్నాథ్ ఖడ్సే, రాజుశెట్టి, యశ్పాల్ భింగే, కాంగ్రెస్ కోటా నుంచి గాయకుడు ఆనంద్ షిండే, రజనీతాయ్ పాటిల్, సచిన్ సావంత్, అనిరుధ్ వంకర్, ముజఫర్ హుస్సేన్ పేర్లున్నాయి. ప్రస్తుతం శివసేన షిండే వర్గానికి మూడు, బీజేపీకి తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నట్లు సమాచారం. అయితే, నాలుగు ఎమ్మెల్సీల కోసం షిండే వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తున్నది.