న్యూఢిల్లీ: మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్.. ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీకు రాజకీయాలు అర్థం కాకుంటే, మీరు ఇంటికి వెళ్లి వంటచేసుకోవాలని సుప్రీయాను ఉద్దేశిస్తూ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఉద్యోగాలు, విద్యాలయాల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఎన్సీపీ మధ్య మాటలయుద్ధం సాగింది. మధ్యప్రదేశ్లో ఓబీసీ కోటా అమలుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఆ రాష్ట్ర సీఎం ఢిల్లీకి వచ్చి, అక్కడ ఎవర్నో కలిసారని, ఆ మరుసటి రెండు రోజులకు ఓబీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సుప్రీయా సూలే ఓ కార్యక్రమంలో కామెంట్ చేశారు.
ఆ వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ రియాక్ట్ అవుతూ.. సుప్రీయాకు రాజకీయాలు తెలియవని, ఇంటికివెళ్లి వంట చేసుకోవాలని, సీఎంను ఎలా కలువాలో కూడా నీకు తెలియదని సుప్రీయాను ఉద్దేశిస్తూ పాటిల్ కామెంట్ చేశారు. బీజేపీ నేత చంద్రకాంత్ స్త్రీ ద్వేషి అని సుప్రీయా భర్త సదానంద సూలే తన ట్విట్టర్లో ఆరోపించారు. తన భార్య పట్ల తనకు గౌరవం ఉందని, ఆమె ఇంట్లో పనిచేస్తుందని, తల్లి అని, ఓ విజయవంతమైన రాజకీయవేత్త అని సదానంద అన్నారు. చంద్రకాంత్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయన్నారు.