ముంబై: ప్రైవేట్ కార్లు, ఆటోలు, బైక్లను పూలింగ్, ట్యాక్సీ, రైడ్ సర్వీసులకు వినియోగించడంపై నిషేధం విధించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర, మూడు, నాలుగు చక్రాల వాహనాలు, రవాణేతర వాహనాలను రైడ్ పూలింగ్, ట్యాక్సీ సేవలుగా ప్రజల రవాణాకు వినియోగించడాన్ని నిషేధించింది. ఈ నెల 19న దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వును విడుదల చేసింది. ప్రజలు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం వెల్లడించింది. దీంతో బైక్, ఆటో, కారు రైడ్ సేవలు అందించే యాప్ సంస్థలకు పెద్ద దెబ్బ తగలనున్నది.
కాగా, మహారాష్ట్రలోని పెద్ద నగరాల్లో యాప్ ఆధారిత బైక్, ఆటో, కారు రైడ్ సర్వీసులు ఇటీవల బాగా పెరిగాయి. దీంతో నాన్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీకి చెందిన బైక్లు, ఆటోలు, వైట్ నంబర్ ప్లేట్ కలిగిన ప్రైవేట్ కార్లను కూడా కొందరు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారు.
అయితే ప్రజల రవాణాకు సంబంధించిన ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ సేవలు అందిస్తున్న రాపిడో వంటి యాప్ ఆధారిత సంస్థలపై బాంబే హైకోర్టు ఈ నెల 13న ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి సేవలను వెంటనే సస్పెండ్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బైక్లు, ఆటోలు, కార్లను ప్రజల రవాణా కోసం వినియోగించకుండా ప్రభుత్వం నిషేధించింది. ఒక వేళ ఉపాధి కోసం అలా వినియోగించాల్సి వస్తే సంబంధిత రవాణా అనుమతులు పొందాలని ఆ ఉత్తర్వులో పేర్కొంది.