గాన కోకిల లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘భారత రత్న లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటిస్తున్నాం.’ అని సీఎంవో పేర్కొంది. ఇక లత మంగేష్కర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ రెండు రోజుల పాటు సంతాప దినాలు కూడా పాటించాలని ఉద్ధవ్ సర్కార్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం కూడా భారతరత్న లతా మంగేష్కర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ రెండు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని నిర్ణయించింది.
ఒంటిపూట సెలవు ప్రకటించిన మమత సర్కార్
భారత రత్న లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా బెంగాల్ ప్రభుత్వం సోమవారం ఒంటిపూట సెలవు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గాన కోకిల లతా మంగేష్కర్ ఆదివారం కన్నుమూశారు. జనవరి 8 న ఆమె కరోనా బారినపడ్డారు. గత 29 రోజులుగా ఆమె ముంబైలోని బ్రీచ్కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం కాస్త మెరుగైందని వార్తలొచ్చాయి. అంతలోనే ఆరోగ్యం విషమించి, తుది శ్వాస విడిచారు. పలు అవయవాల వైఫల్యం వల్ల లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.