ముంబై: మహరాష్ట్రలో కరోనా కేసుల రోజువారీ నమోదు 40 వేలకుపైగానే కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 41,327 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,65,346కు చేరింది. ప్రస్తుతం 21,98,414 మంది కరోనా రోగులు హోమ్ ఐసొలేషన్లో, 2,921 మంది క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 29 మంది కరోనా వల్ల మరణించారు. ఆదివారం 40,386 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కాగా, దేశ వాణిజ్య నగరం ముంబైలో కూడా కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 7,895 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 60,371కు, మొత్తం కేసుల సంఖ్య 9,99,862కు చేరింది. కొత్తగా ఆసుపత్రిలో 688 మంది కరోనా రోగులు చేరారు. 21,025 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ముంబైలో కరోనాతో 11 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 16,457కు పెరిగింది.
మరోవైపు మహారాష్ట్రలో ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతున్నది. ఆదివారం కొత్తగా 8 కేసులను గుర్తించారు. పూణేలో 5, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,738కి చేరింది. ఇప్పటి వరకు 932 మంది ఒమిక్రాన్ రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.