జమ్ము, డిసెంబర్ 25: జమ్ముకశ్మీర్లో గత రెండున్నరేండ్లుగా కొనసాగుతున్న పరిపాలన కంటే రాచరికమే నయం అని కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ అనంతర రాజకీయ, పరిపాలన పరిస్థితులతో ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారని ఆరోపించారు. తద్వారా, ఆజాద్ పార్టీ మారతారన్న విశ్లేషణలకు ముగింపు పడేలా చేశారు. ఆజాద్ రాజ్యసభ సభ్యత్వం పూర్తైన సందర్భంగా వీడ్కోలు సమావేశంలో మోదీ కంటతడి పెట్టుకొంటూ ఆజాద్ను పొగిడారు. ఆజాద్ తనకు నిజమైన మిత్రుడని చెప్పుకొచ్చారు. అప్పుడే ఆజాద్ కూడా మోదీని ప్రశంసించారు. మరోవైపు, ఆజాద్ అదే సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్లో సంస్కరణలు కోరుతూ సోనియాకు లేఖ రాసిన 23 మంది అసమ్మతి నేతల్లో ఆయన కూడా ఒకరు. దీంతో ఆజాద్ పార్టీ మారతారని, బీజేపీలో చేరతారని జోరుగా విశ్లేషణలు వచ్చాయి.
తాజా ఆరోపణలతో అదంతా వట్టిదే అని తేలిపోయింది. బాధల్లో ప్రజలువేరే ప్రాంతాల నుంచి వచ్చే వారి నుంచి స్థానికుల భూములకు రక్షణ కోసం, వారి ఉపాధి కోసం మహారాజా రక్షణ కల్పించారని పేర్కొన్నారు. ‘మహారాజాను చాలా మంది డిక్టేటర్ అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే ఆయన పాలనే మంచిగా ఉందనిపిస్తున్నది. ప్రజలు బాధల్లో ఉన్నారు. వ్యాపారాల్లేవు. ఉద్యోగాల్లేవు. ధరలు పెరిగాయి’ అని వ్యాఖ్యానించారు. తన దృష్టిలో జమ్ము, కశ్మీర్ వేర్వేరు కాదన్నారు. కాగా, దర్బార్ సంస్కృతిని నిలిపివేయడంపై ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జమ్ము, కశ్మీర్ ప్రజల మధ్య సాంస్కృతిక వారధిగా ఉండేదని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజధానిని ఆరు నెలలకొకసారి మార్చడమే దర్బార్ సంస్కృతి.