న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ (Jaya Bachchan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారని ఆరోపించారు. దీంతో కుంభమేళ నీరు కలుషితమైందని విమర్శించారు. సోమవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో జయా బచ్చన్ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. సామాన్య ప్రజల కోసం కుంభమేళాలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. ‘ప్రస్తుతం అత్యంత కలుషితమైన నీరు ఎక్కడ ఉంది? అది కుంభమేళాలో ఉంది. తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పారేశారు. దీని కారణంగా నీరు కలుషితమైంది. అసలు సమస్యలను పరిష్కరించడం లేదు. కుంభమేళాను సందర్శించే సామాన్యులకు ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదు. వారికి ఎలాంటి ఏర్పాట్లు లేవు’ అని అన్నారు.
కాగా, జనవరి 29న కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టిందని ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ విమర్శించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించలేదని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వడం లేదని, పూర్తిగా కంటితుడుపు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ నీరు, జలశక్తిపై ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పార్లమెంట్లో విమర్శించారు. కుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి వాస్తవ సంఖ్యను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాచిందని ఆరోపించారు. దీనిపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు.
#WATCH | Delhi: Samajwadi Party MP Jaya Bachchan says, “… Where is the water most contaminated right now? It’s in Kumbh. Bodies (of those who died in the stampede) have been thrown in the river because of which the water has been contaminated… The real issues are not being… pic.twitter.com/9EWM2OUCJj
— ANI (@ANI) February 3, 2025