Madras high court | దేశ హైకోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఓ న్యాయమూర్తి వాట్సాప్ ద్వారా కేసును విచారించారు. ఆదివారం సెలవు రోజున కేసు విచారణ సాగింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ ఆదివారం ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు నాగర్ కోయిల్కు వెళ్లారు. అక్కడ ఉంటే కేసును వాట్సాప్ ద్వారా విచారించారు. కేసు వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ధర్మపురి జిల్లాలో అభీష్ట వరదరాజస్వామి రథయాత్ర జరిగింది. అర్ధరాత్రి జరిగిన వేడుకల్లో రథానికి విద్యుత్ తీగలు తగిలి అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది.
ఘటనలో 11 మంది భక్తులు ప్రాణాలను కోల్పోయారు. మరో 17 మంది భక్తులు గాయపడ్డారు. ఈ క్రమంలో రథయాత్రలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ధర్మపురి జిల్లాలోని అభిష్ఠ వరదరాజ స్వామి ఆలయంలో సోమవారం రథయాత్ర జరగాల్సి ఉంది. కాగా కొన్ని రోజుల క్రితం రథయాత్రను నిలిపివేయాలని ఓ ఇన్స్పెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అభీష్ట వరదరాజ స్వామి ఆలయంలో సోమవారం రథయాత్ర జరగాల్సి ఉంది.
దీంతో స్వామి వారి దేవాలయం అనువంశిక ధర్మకర్త పీఆర్ శ్రీనివాసన్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సత్వరమే విచారణ చేపట్టాలని కోరారు. రథయాత్ర నిర్వహించకపోతే.. దైవం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందంటూ అభ్యర్థించారు. దీంతో వివాహ వేడుకలో పాల్గొన్న జస్టిస్ జీఆర్ స్వామినాథన్ వాట్సాప్లోనే విచారణ చేపట్టారు. పిటిషన్ విజ్ఞప్తి మేరకు నాగర్ కోయిల్ నుంచి రిట్ పిటిషన్ను అత్యవసర విచారణ చేపట్టాల్సి వచ్చిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
జస్టిస్ జీఆర్ స్వామినాథన్ నాగర్కోయిల్లో వాదనలు వినిపించగా, పిటిషనర్ తరఫు న్యాయవాది రాఘవాచారి, సొలిసిటర్ జనరల్ ఆర్ షణ్ముగసుందరం వేర్వేరు ప్రాంతాల నుంచి వాట్సాప్లో వాదనలు వినిపించారు. ఈ క్రమంలో.. రథయాత్రను నిలిపేసేందుకు ఇన్స్పెక్టర్ ఆదేశాలివ్వలేరని జస్టిస్ స్వామినాథన్ అంగీకరించారు. రథయాత్రను నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చారు. ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రథయాత్ర జరిగే సమయంలో.. పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.