చెన్నై : తమిళనాడు చెన్నైలోని అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయ తాళాలను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామికి అందించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఇరువర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయానికి తాళం వేసి సీలు వేయాలని దక్షిణ చెన్నై రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు బుధవారం రద్దు చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 145(1), 146 కింద ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఆర్డీవో జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్ ఎన్ సతీశ్ కుమార్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామికి కార్యాలయ తాళాలు అందజేయాలని ఆదేశించారు.
ఎడప్పాడి పళనిస్వామి, పార్టీ బహిష్కృత నేత ఓ పన్నీర్ సెల్వం ఆర్డీవో ఆదేశాలను సవాల్ చేస్తూ వ్యక్తిగత పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎడప్పాడి పళనిస్వామి అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. సీల్ను తొలగించి కార్యాలయ తాళాలను పళనిస్వామికి అప్పగించడంతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, కార్యకర్తలు లోపలికి రాకుండా అవసరమైన పోలీసు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.