న్యూఢిల్లీ: ఒమిక్రాన్ జాబితాలో మధ్యప్రదేశ్ కూడా చేరింది. ఆ రాష్ట్రంలో తొలిసారే ఎనిమిది కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్ కరోనా కేసులు ఇండోర్లో వెలుగుచూసినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదివారం తెలిపారు. ఒమిక్రాన్ సోకిన వారిలో చాలా మంది యువతేనని చెప్పారు. ఎనిమిది మందిలో ముగ్గురు మహిళలని, ఆరుగురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
మరోవైపు ఒడిశాలో మరో నలుగురికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకినట్లు ఆదివారం నిర్థారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరింది. నలుగురు కొత్త రోగులలో ఇద్దరు నైజీరియా నుంచి, మరో ఇద్దరు యూఏఈ నుంచి వచ్చారని ఆ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీస్ (డీహెచ్ఎస్) బిజయ్ మొహాపాత్ర తెలిపారు. నలుగురి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కాగా, ఆదివారం కొత్తగా 12 ఒమిక్రాన్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం సంఖ్య 434కు చేరింది.