Madhya Pradesh | మధ్య ప్రదేశ్లోని సిద్ధిలో ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన ఘటన వివాదం సమసిపోక ముందే మరో దుర్ఘటన జరిగింది. గ్వాలియర్లో నడుస్తున్న ఒక కారులో ఓ యువకుడిని మరో వ్యక్తి పాదాలు నాకించిన హేయమైన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. హేయమైన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో బాధితుడు, నిందితులు కూడా గ్వాలియర్ జిల్లా దబ్రా పట్టణ వాసులుగా ఉన్నారు.
కారు నడుస్తుండగా బాధితుడ్ని ఒక వ్యక్తి పలుసార్లు కొట్టిన ద్రుశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. కారులో ఉన్న వ్యక్తి ‘గొలు గుర్జార్ బాప్ హై’ అని అంటున్నట్లు వినిపిస్తున్నది. నిందితులు కూడా బాధితుడ్ని దుర్భాషలాడుతూ పదేపదే ఆయన ముఖంపై కొట్టిన ద్రుశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మరో వీడియో క్లిప్లో పాదరక్షలతో బాధితుడ్ని కొడుతున్న ద్రుశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా స్పందిస్తూ.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.