మొరెనా: మధ్యప్రదేశ్ రాష్ట్రం మొరెనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని వేగంగా వచ్చిన డంపర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలేరోలోని ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
బుధవారం ఉదయం మొరెనా జిల్లా నూరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని గురైయా హోటల్ సమీపంలో జాతీయ రహదారి 44పై ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా టిక్టోలీ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అందరూ గ్వాలియర్ ఆస్పత్రిలో ఉన్న ఓ పేషెంట్ను పరామర్శించేందుకు వెళ్లి మొరెనాకు తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.