2018లో ఓటరునాడిని పట్టుకోవడంలో విఫలమైన సర్వేసంస్థలు.. ఈసారి ఎగ్జిట్పోల్తో గందరగోళానికి తెరతీశాయి. కొన్ని సంస్థలు బీఆర్ఎస్కు పూర్తి ఆధిక్యతను ప్రకటించగా, మరికొన్ని హంగ్ తప్పదన్నట్టుగా చూపాయి. జాతీయ సంస్థల సర్వేలో మధ్యప్రదేశ్, మిజోరంలోనూ అస్పష్ట చిత్రమే కనిపించింది. రాజస్థాన్లో బీజేపీ, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ రాబోతున్నట్టు అంచనా వేశాయి.
Assembly Elections | న్యూఢిల్లీ, నవంబర్ 30: సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారంతో ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. రాజస్థాన్లో ఈ సారి కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు నెలకొన్నది. ఛత్తీస్గఢ్లో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. 40 స్థానాలున్న మిజోరంలో అధికార ఎంఎన్ఎఫ్-విపక్ష జెడ్పీఎం మధ్య గట్టి పోటీ నెలకొన్నది. ఇక్కడ హంగ్ ఏర్పడుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
మధ్యప్రదేశ్లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న ఎన్నికలు ముగిశాయి. గతంతో పోలిస్తే ఈ సారి రాష్ట్రంలో రికార్డ్స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2018లో 75.63శాతం పోలింగ్ జరగ్గా, ఈసారి 77.15శాతం నమోదైంది. రాష్ట్రంలో 2003 నుంచి సుదీర్ఘకాలంగా బీజేపీ అధికారంలో ఉంది. 2018లో అనూహ్యంగా కాంగ్రెస్ గెలుపొందినా, ఆపరేషన్ ‘కమల్’తో కాంగ్రెస్ సర్కార్ను బీజేపీ కూల్చింది. దీంతో శివరాజ్సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ సారి రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.
రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ సర్కార్కు గట్టి షాక్ తగిలే సూచనలు కనపడుతున్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకుగానూ 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం కైవసం చేసుకోవాలంటే 100 స్థానాల్లో విజయం సాధించాలి. ఎడారి రాష్ట్రంలో ప్రతి ఐదేండ్లకోమారు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయముంది. గురువారం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ సారి ప్రభుత్వం మారుతుందనే అంచనావేశాయి.
ఛత్తీస్గఢ్లో స్వల్ప మెజార్టీతో హస్తం పార్టీ అధికారాన్ని నిలుపుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. 90 స్థానాలున్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముందని అంచనావేశాయి. గత ఎన్నికల్లో కేవలం 15 స్థానాలకు పరిమితమైన బీజేపీకి ఈసారి మరిన్ని స్థానాలు దక్కనున్నాయి.
40 స్థానాలున్న మిజోరంలో ఓటర్లు ఎటువైపు ఉన్నారన్నది ఎగ్జిట్ పోల్స్ తేల్చలేక పోయాయి. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) మధ్య ప్రధాన పోటీ ఉన్నట్టు తెలుస్తున్నది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ప్రభావం ఇక్కడ పెద్దగా లేదు. బీజేపీకీ ఒకటీ రెండు స్థానాలు దక్కుతాయని, కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో ప్రభావం చూపుతుందని ఎగ్జిట్పోల్స్ అంచనావేశాయి.