న్యూఢిల్లీ, ఆగస్టు 9: గాయాలు మానడానికి కట్టిన పట్టీలు తొలగించేప్పుడు చాలా నొప్పి వేస్తుంది. కొన్ని సందర్భాల్లో గాయమైన చోట చర్మం పట్టీతో పాటే వచ్చి రక్తం కూడా కారుతుంది. ఫలితంగా గాయం మానడం ఆలస్యం అవుతుంది. అంతే కాకుండా ఈ పట్టీలు మట్టిలో కలిసిపోవడానికి చాలా కాలం పడుతుంది. దీన్ని నిరోధించడానికి ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు అతితక్కువ ఖర్చులో లభించే బ్యాండేజ్ తయారు చేశారు. కృత్రిమ పాలిమర్లను ఉపయోగించి తయారు చేసిన ఈ బ్యాండేజ్ గాయంపై కట్టినప్పుడు దానికదే గాలిలోని తేమను గ్రహించి తడిగా ఉంటుంది. ఫలితంగా తొలగించేప్పుడు నొప్పి ఉండదు. అంతే కాకుండా ఇవి సులభంగా మట్టిలో కలిసిపోతాయి. పర్యావరణానికి హాని జరుగదు. మామూలు బ్యాండేజీతో పోల్చితే వీటి ధర సగం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.