Lung Cancer : దేశవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రెండేళ్లలో లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ల సంఖ్య 5 శాతం పెరిగాయని వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం (ఎన్సీఆర్పీ) డేటాలోని వివరాలను పార్లమెంట్లో కేంద్రం ఉటంకించింది. డేటా ప్రకారం..ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా పోయిన ఏడాది 34వేల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ ఏడాది అత్యధికంగా రెండు లక్షల కేసులతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో స్త్రీ, పురుషులు కలిపి 2,10,958 మంది లంగ్ క్యాన్సర్తో బాధపడతున్నారు. మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో లంగ్ క్యాన్సర్ కేసులు తమిళనాడులో ఎక్కువ నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ ఉన్నాయి. 40 నుంచి 64 ఏళ్ల మధ్యన ఉన్నవాళ్లలోనే ఈ మహమ్మారి ఎక్కువ కనిపించినట్టు ఐసీఎంఆర్ డేటా చెప్తోంది.
మనదేశంలోని ప్రతి తొమ్మిది మందిలో ఒకరు జీవితకాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని ఐసీఎంఆర్ సంస్థ తెలిపింది. అంతేకాదు ఈ జబ్బు 2025 నాటికి 12.8 శాతానికి పెరిగే అవకాశం ఉందని చెప్పింది. పొగతాగేవాళ్లు లంగ్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఈ మహమ్మారి సోకినవాళ్లలో విపరీతమైన దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీలో నొప్పి వస్తుంది. బరువు తగ్గిపోతారు. తరచూ తలనొప్పి వస్తుంది.