లుథియానా : పంజాబ్లోని లుథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్లో నిన్న పేలుడు సంభవించి ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుడు వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ, ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. పేలుడులో ఐఈడీ వినియోగించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
సున్నిత ప్రదేశాలు, కీలక భవనాలు, రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ముందే పంజాబ్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. జులై 9, డిసెంబర్ 7, పేలుడు జరిగిన రోజు(డిసెంబర్ 23) కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. పేలుళ్లకు ఐఈడీ వినియోగించే అవకాశం ఉన్నట్టు కూడా పేర్కొన్నాయి. ఈ పేలుడు ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.