న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి, లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్కుమార్ సక్సేనాకు మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఢిల్లీలో కొన్ని వర్గాలకు సబ్సిడీ విద్యుత్తు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఫైల్ను ఎల్జీ ఆమోదించకుండా పెండింగులో పెట్టారని, అందువల్ల సబ్సిడీ విద్యుత్తును ఇవ్వలేకపోతున్నామని ఢిల్లీ విద్యుత్తు శాఖ మంత్రి అతిషి శుక్రవారం ప్రకటించారు. బీజేపీ ప్రోద్భలంతోనే ఎల్జీ ఈ ఫైల్ను తొక్కిపెట్టారని ఆరోపించారు. ఈ నెల 11న సబ్సిడీకి ఉద్దేశించిన ఫైల్ను అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్ ఆమోదించి పంపితే ఇప్పటివరకు ఎల్జీ ఎటూ తేల్చలేదని విమర్శించారు.
ఫైల్పై తాను వివరణ ఇస్తానని కోరినా ఎల్జీ సమయం ఇవ్వలేదని తెలిపారు. అతిషి ప్రకటన నేపథ్యంలో ఎల్జీ ఆఫీస్ దిగొచ్చింది. శుక్రవారం సాయంత్రానికి ఫైల్పై ఎల్జీ సంతకం చేశారు. ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో న్యాయవాదులు, రైతులు, 1984 అల్లర్ల సిక్కు బాధితులు తదితరులకు తక్కువ రేటుకు విద్యుత్తు అందిస్తున్నది. ఈ వర్గాలు వినియోగించే మొదటి 200 యూనిట్లు ఉచితంగా, తర్వాతి 200 యూనిట్లను 50 శాతం సబ్సిడీకి అందిస్తున్నది. నగరంలోని 58 లక్షలకుపైగా ఉన్న గృహ వినియోగదారుల్లో 48 లక్షల మంది ఈ సబ్సిడీ పొందుతున్నారు. ఈ పథకం 2019 నుంచి అమల్లో ఉన్నది. ఢిల్లీ చట్టాల ప్రకారం ఏడాదికోసారి దీనిని రాష్ట్ర క్యాబినెట్ కొత్తగా ఆమోదించి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు ఎల్జీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.