న్యూఢిల్లీ: బీజేపీ నేత నిషికాంత్ దూబే సోమవారం లోక్సభ(Lok Sabha)లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను వాస్తవానికి ఆ ప్రసంగం నుంచి తొలగించారు. కానీ ఆ వ్యాఖ్యలకు చెందిన రికార్డును మాత్రం లోక్సభ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ అంశంపై ఇవాళ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ ప్రశ్నించారు. ప్రసంగం నుంచి తొలగించిన వ్యాఖ్యలను మళ్లీ ఎలా రీ రికార్డు చేశారని ఆయన నిలదీశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
సోమవారం దూబే మాట్లాడుతూ.. వెబ్పోర్టల్ న్యూస్క్లిక్కు 38 కోట్ల ఫండింగ్ వచ్చిందని, ఆ డబ్బును ఇండియాకు వ్యతిరేకంగా ఖర్చు చేయాలన్న ఉద్దేశంతో పంపించారని, దీనికి సంబంధించిన రిపోర్టు న్యూయార్క్టైమ్స్ పత్రికలో వచ్చినట్లు దూబే ఆరోపించారు. న్యూస్క్లిక్కు చెందిన వ్యక్తి తుక్డే తుక్డే గ్యాంగ్లో సభ్యుడని ఆయన విమర్శించారు. దీని ద్వారా లబ్ధిపొందిన వారిపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 2005 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీకి చైనా ప్రభుత్వం డబ్బు ఇచ్చిందని, కాంగ్రెస్ దేశాన్ని విభజించాలని చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు. అయితే రికార్డుల నుంచి దూబే ప్రసంగంలో ఉన్న కొన్ని అంశాలను తొలగిస్తున్నట్లు తొలుత లోక్సభ సెక్రటేరియటే్ పేర్కొన్నది. కానీ మళ్లీ లోక్సభ సైట్లో ఆ తొలగించిన ప్రసంగానికి చెందిన భాగాన్ని అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన ప్రసంగాన్ని తప్పుపడుతూ ఇవాళ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది.