న్యూఢిల్లీ: వృందావన్లోని శ్రీ బంకి బిహారీ ఆలయం(Banke Bihari Temple), ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు స్పందించింది. శ్రీ కృష్ణ భగవానుడు తొట్టతొలి మధ్యవర్తి అని, ఆయన అడుగుజాడల్లో నడవాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. బంకి బిహారీ ఆలయానికి చెందిన 500 కోట్ల నిధులతో రీడెవలప్మెంట్ పనులు చేపట్టాలన్న అంశంపై వివాదం చెలరేగుతున్నది. ఆ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు వాదనలు విన్నది. శ్రీ కృష్ణుడు తొలి మీడియేటర్ అని, ఈ సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ ట్రస్టు మధ్య ఉన్న వివాదం పరిష్కారం కోసం కమిటీని ప్రతిపాదిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
ఆలయ నిదులను రహస్య వినియోగించే పద్ధతిని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ఈ అంశంలో యూపీ సర్కారు వైఖరిని కోర్టు తప్పుపట్టింది. జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాలా బాగ్చి ఈ ప్రతిపాదన చేశారు. ఆలయ నిధులను వాడుకోవాలని మే 15వ తేదీన ఇచ్చిన తీర్పును విత్డ్రా చేసుకోవాలని సుప్రీం తెలిపింది. గతంలో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నామని కోర్టు చెప్పింది. ట్రస్టీ సభ్యుల్లో మాజీ హైకోర్టు జడ్జీ లేదా సీనియర్ రిటైర్డ్ న్యాయవాది ఉంటారని పేర్కొన్నది. కమిటీ ఆదేశాల మేరకు ఆలయ వ్యవహారాలు కొనసాగుతాయని కోర్టు తెలిపింది. బంకి బిహారీ ఆలయ పునరుద్దరణ కోసం వినియోగించే నిధులపై తాత్కాలిక కమిటీకి అవకాశం ఇవ్వనున్నట్లు కోర్టు వెల్లడించింది.
బంకి బిహారీ ఆలయాన్ని 1862లో నిర్మించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు ఆ ఆలయాన్ని విజిట్ చేస్తుంటారు. షిబాయితీలు ఆ టెంపుల్ను మ్యానేజ్ చేస్తున్నారు. వారసత్వ పురోహితులు అక్కడ పూజలు, నిర్వహణ చేస్తున్నారు. 2022 జన్మాష్టమి వేడుకల వేళ తొక్కిసలాట ఘటన జరిగింది. దీంతో అక్కడ ఆలయ పునరుద్దరణ చేపట్టాలని డిమాండ్ వచ్చింది. భక్తుల తాకిడీని తగ్గించేందుకు, రక్షణ చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించాలని యూపీ సర్కారును 2023 సెప్టెంబర్లో అలహాబాద్ కోర్టు ఆదేశించింది.