Loksabha Elections : మణిపూర్లో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరిగింది. ఇన్నర్ మణిపూర్ లోక్సభ స్థానానికి పోలింగ్ సందర్భంగా పలుచోట్ల కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. మొయిరాంగ్ కాంపు ప్రైమరీ స్కూల్ దగ్గర జరిగిన కాల్పుల్లో ఒకరికి గాయాలయ్యాయి. మరికొన్ని చోట్ల దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఇలా ఉద్రిక్తతల నడుమనే సాగిన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
పోలింగ్ ముగిసే సమయానికి ఇన్నర్ మణిపూర్ లోక్సభ స్థానంలో 68 శాతం పోలింగ్ నమోదైంది. బమన్ కాంపు, సెక్మైజిన్ ఖునావో మమాంగ్, ఖోంగ్మాన్ జోన్-5, ఖురాయ్ తొంగమ్ పోలింగ్స్టేషన్లలో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అదేవిధంగా అరపాటి మానింగ్, మొయిరాంగ్ కాంపు ప్రైమరీ స్కూల్, వాంగూ, తమ్నపాక్పీ పోలింగ్ స్టేషన్ల దగ్గర కాల్పుల ఘటనలు జరిగాయి.
అదేవిధంగా ఖైడెమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలింగ్ను నిలిపివేశారు. కాగా, మణిపూర్ రాష్ట్రం మొత్తాన్ని రెండు లోక్సభ నియోజకవర్గాలుగా విభజించారు. అందులో ఒకటి ఇన్నర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గం కాగా, రెండోది అవుటర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గం. తొలి విడతలో ఇన్నర్ మణిపూర్ లోక్సభ స్థానానికి పోలింగ్ నిర్వహించారు.