న్యూఢిల్లీ, జూన్ 26: ఓవైపు అధునాతన వందే భారత్ రైళ్లను తెచ్చామని గొప్పలు చెబుతున్నారని, అయితే మరోవైపు ఉన్న రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఆదివారం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో విద్యుదాఘాతంతో మరణించిన యువతి తండ్రి లోకేశ్ కుమార్ చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ విద్యుత్తు షాక్ తర్వాత తన బిడ్డకు ఎలాంటి సాయం లేదా ప్రథమ చికిత్స అందలేదని, సమీపంలో అంబులెన్స్ లేదని, వైద్యులు, పోలీసులు కూడా లేరన్నారు. రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా, సదుపాయాలు ఆ స్థాయిలో లేవని, ఘటన తర్వాత చర్యలు తీసుకొంటామని చెప్పిన రైల్వే అధికారులు, ఇప్పటివరకు ఆ విషయంలో ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు.