Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట కలిగింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూకుంభకోణంలో ఆయనకు అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త క్లీన్ చీట్ ఇచ్చింది. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు ప్రకటించారు.
ముడా భూముల కేటాయింపుల వివాదంలో కోట్లాది రూపాయల విలువైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా సీఎం సిద్ధరామయ్య కుట్ర చేశారంటూ సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై గవర్నర్ విచారణకు అనుమతించారు. సామాజిక కార్యకర్తల వినతి మేరకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు అనుమతి ఇవ్వడం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూర్లోని కేసరే గ్రామంలో మూడెకరాల భూమి ఉంది. ఆ భూమిని ఆమెకు సోదరుడు మల్లికార్జున్ గిఫ్ట్గా ఇచ్చారు.
ఆ భూమిని అభివృద్ధి చేసేందుకు ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూర్లో కీలకమైన విజయనగర్లో 38,238 చదరపు అడుగుల ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింద ఇచ్చిన ప్లాట్ల మార్కెట్ విలువ కేసరేలో స్వాధీనం చేసుకున్న భూమి విలువకంటే ఎక్కువగా ఉంటుందని బీజేపీ ఆరోపించింది. భూ కేటాయింపుల్లో దాదాపు రూ.45కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగించినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, కుమారుడు ఎస్ యతీంద్రతో సహా పలువురు సీనియర్ ముడా అధికారులు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి.