Lok Sabha Speaker | టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. బీజేపీ ఎంపీ నిషికాంత్ తీవ్ర ఆరోపణలు చేస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖను.. స్పీకర్ ఓం బిర్లా ఎథిక్స్ కమిటీకి పంపారు. ఈ ఎథిక్స్ కమిటీకి చైర్మన్గా బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్ఖర్ ఉన్నారు. కాగా, అదానీ గ్రూప్తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా మాట్లాడేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి టీఎంసీ ఎంపీ రూ.కోట్లలో డబ్బులు తీసుకున్నారని లేఖలో నిషికాంత్ దూబే ఆరోపించారు.
2019 నుంచి 2023 మధ్య మహువా మొయిత్రా అడిగిన 61 ప్రశ్నల్లో.. 50 దర్శన్ హీరానందానీ కోరిక మేరకు అడిగినవేనని.. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సుప్రీంకోర్టు న్యాయవాది తనకు అందించారని లేఖలో పేర్కొన్న ఆయన.. తక్షణమే మహువాను లోక్ సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే లోక్సభలో మహువా మోయిత్రా లాగిన్ను తనిఖీ చేయాలని ఐటీ మంత్రిని సైతం కోరారు. లోక్సభ వెబ్సైట్కు చెందిన లాగిన్ వివరాలను ఎవరెవరికి ఇచ్చారనే విషయాలపై దర్యాప్తు చేయాలని లేఖలో కోరారు. మరో వైపు బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలపై మహువా మొయిత్రాతో పాటు హీరానందానీ గ్రూప్ ఖండించింది.