ముంబై, జనవరి 28: ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆదివారం ప్రకటించారు. ఆల్ ఇండియా ప్రిసైడింగ్ అధికారుల 84వ వార్షిక సమావేశంలో ఆయన ఇటీవల దేశంలోని కొన్ని రాష్ర్టాలలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో పొందుపరిచిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు వేరొక పార్టీలోకి చేరినా, లేదా సొంత పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినా తమ పదవికి అనర్హులవుతారు. అయితే ఒక పార్టీకి చెందిన వారిలో మూడింట రెండు వంతుల మంది మరో పార్టీలో విలీనం అయితే వారిపై అనర్హత వేటు పడదు.