భారత పార్లమెంటులో బుధవారం భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకున్నది. విజిటర్ పాస్లపై వచ్చిన ఇద్దరు దుండగులు లోక్సభ గ్యాలరీనుంచి సమావేశ ప్రధాన మందిరంలోకి దూకి బీభత్సం సృష్టించారు. పొగను వదులుతూ అలజడి రేపారు. సరిగ్గా 22 ఏండ్ల కిందట ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13వ తేదీనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో దేశం ఉలిక్కిపడింది. మరో ఇద్దరు వ్యక్తులు కూడా పార్లమెంట్ వెలుపల పొగ వదులుతూ ఆందోళన చేశారు. ఈ ఘటన నేపథ్యంలో కొత్త పార్లమెంట్లో భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: భారత పార్లమెంటు మరోసారి ఉలిక్కిపడింది. 22 ఏండ్ల క్రితం లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేసిన డిసెంబర్ 13నే మళ్లీ పార్లమెంటుపై అసాధారణ ఘటన చోటుచేసుకొన్నది. నాడు ఉగ్రవాదులు పార్లమెంటు భవనం లోపలికి ప్రవేశించలేకపోయారు. కానీ, ఈసారి పక్కా ప్లాన్ ప్రకారం దుండగులు ఏకంగా లోక్సభ సమావేశ మందిరంలోకే చొరబడి భీతావహం సృష్టించారు. సందర్శకులుగా సభలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు.. గ్యాలరీ నుంచి దూకి ఒక రకమైన పసుపు రంగు పొగతో కూడిన గ్యాస్ను వదులుతూ హంగామా చేశారు. సభలో బెంచీలపై నుంచి దూకుతూ స్పీకర్ కుర్చీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించి భయోత్పాతం సృష్టించారు. ‘నిరంకుశం నశించాలి’ అని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఇద్దరూ సభా మందిరం మొత్తం పరుగులు పెట్టారు. ఇదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ వెలుపల కూడా ఇదే విధమైన పసుపు రంగు పొగను వదిలి ఆందోళన చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నది. నిరంకుశత్వం నశించాలి, భారత్ మాతాకీ జై, జై భీమ్, జై భారత్ అంటూ నినాదాలు చేశారు. ఈ భద్రతా వైఫల్యం ఘటన నేపథ్యంలో పార్లమెంటు రక్షణ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉన్నదనేది తేలిపోయింది.
బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయం.. స్పీకర్ స్థానంలో బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ ఉన్నారు.. సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నడుస్తున్నది.. అంతలోనే ఒక్కసారిగా కలకలం. విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సభా మందిరంలోకి దూకారు. తమ వెంట తెచ్చుకొన్న పసుపు రంగులో ఉన్న ఒకరకమైన గ్యాస్ను సభలో వదిలారు. బెంచీలపైకి ఎక్కి ‘నిరంకుశత్వం నశించాలి’ అని నినాదాలు చేశారు. ఒక బెంచీ నుంచి మరో బెంచీపైకి దూకుతూ బీభత్సం సృష్టించారు. దీంతో కొంత మంది ఎంపీలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన ఎంపీలు హనుమాన్ బేణివాల్, మలూక్ నగర్, గుర్దీప్ సింగ్ తదిరులు దుండగులను పట్టుకొనేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకొని, చితకబాదారు. సభా మందిరం మొత్తం గ్యాస్తో నిండిపోయింది. దీంతో సభను 2 గంటల వరకు వాయిదా వేశారు. అప్పటికిగాని రంగప్రవేశం చేయని భద్రతాసిబ్బంది.. దుండగులు ఇద్దరి అరెస్టు చేశారు.
దుండగులు తమ షూలలో పొగ డబ్బాలు దాచి లోపలికి తీసుకెళ్లినట్టు గుర్తించారు. ఈ ఘటన సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా సభలో లేరు. వీరు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. సభలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అర్జున్ మేఘ్వాల్ సహా ప్రతిపక్ష ఎంపీలు రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌదరితో పాటు దాదాపు 100 మంది ఎంపీలు ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత సభలో స్పీకర్ ఓంబిర్లా ఈ ఘటనపై ప్రకటన చేశారు. దుండగులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ అంశాన్ని కొందరు సభ్యులు లేవనెత్తేందుకు ప్రయత్నించగా ‘ఇది పార్లమెంటరీ అంశం కాదు’ అని అన్నారు.
భద్రతా వైఫల్యం ఘటనకు మోదీ సర్కారు సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ‘హోంమంత్రి అమిత్షా వెంటనే రాజీనామా చేయాలి. పార్లమెంటు భద్రతపై కనీస ప్రణాళిక కూడా ప్రభుత్వం వద్ద లేదు. విజిటర్స్ గ్యాలరీ సరిగ్గా ఎంపీల పైన ఉంటుంది. పార్లమెంటుకే రక్షణ లేకపోతే ఇక దేశానికి ఏం రక్షణ ఉంటుంది?’ అని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. దుండగులు అధికార పార్టీ ఎంపీ గెస్టులుగా వచ్చారు. దీనిపై మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉన్నది. దుండగులు గ్యాస్ మాత్రమే తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ప్రాణాంతకమైన వస్తువులు తీసుకొచ్చి ఉంటే ఏం జరిగేదో ఊహించుకోండి. ఈ ఘటనపై దేశానికి హోంమంత్రి సమాధానం చెప్పాలి’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ డిమాండ్ చేశారు. పార్లమెంటు పాత భవనంతో పోల్చితే కొత్త భవనంలో రక్షణ చర్యలు చాలా బలహీనంగా ఉన్నాయని విమర్శించారు. ‘ఇది భారత ప్రజాస్వామ్యంపై దాడి. ఇది కేంద్ర హోంశాఖ ఘోర వైఫల్యం. రెండు నెలల క్రితమే ఖలిస్థానీల నుంచి హెచ్చరికలు వచ్చాయి. అయినా భద్రతపై పటిష్ఠ చర్యలు చేపట్టలేదు’ అని కేరళ ఎంపీ ఎన్కే ప్రేమ్చందన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కొత్త భవనంలో భద్రతా ఏర్పాట్లపై ఎంపీలు మొదటినుంచీ ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉన్నారు. 2001లో పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు అధికార, విపక్షాలు ఒక్క మాటపై నిలబడ్డాయి. కానీ, ఇప్పుడు ఈ ఘటనపై ప్రభుత్వం కనీసం స్పందించటం లేదు’ అని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా విమర్శించారు.
2001 డిసెంబర్ 13న పాకిస్థాన్కు చెందిన లష్కరే తాయిబా ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేశారు. ఈ ఘటనకు 22 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా మరోసారి పార్లమెంటుపై దాడి చేస్తామని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) ఉగ్ర సంస్థ నాయకుడు గురుపత్వంత్సింగ్ పన్నూ ఇటీవల హెచ్చరించాడు. డిసెంబర్ 13లోపే దాడి చేస్తామని సవాల్ చేశాడు. ‘ఢిల్లీని ఖలిస్థాన్గా మారుస్తాం’ అని ఓ వీడియో విడుదల చేశాడు. అతడి ప్రకటనను నిజం చేస్తూ.. డిసెంబర్ 13నే ఏకంగా పార్లమెంటు భవనం లోపల తాజా ఘటన జరుగటం గమనార్హం. అయితే ప్రాథమిక విచారణలో ఈ ఘటనకు పన్నూ స్టేట్మెంట్కు మధ్య సంబంధం లేదని తేలినట్టు స్పీకర్ ఓంబిర్లా సభలో ప్రకటించారు.
లోక్సభ మందిరంలోకి దూకిన దుండగులను సాగర్ శర్మ(26), డీ మనో రంజన్(34)గా గుర్తించారు. సాగర్ శర్మది యూపీలోని లక్నో కాగా, మనోరంజన్ది కర్ణాటకలోని మైసూర్. ఇక పార్లమెంట్ వెలుపల ఘటనకు పాల్పడిన వారిని మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండే(25), హర్యానాలోని హిస్సార్కు చెందిన నీలం దేవి(42)గా పోలీసులు గుర్తించారు. వీరితో పాటు ఈ కుట్రలో హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన లలిత్ ఝా, విక్కీ శర్మల పాత్ర కూడా ఉన్నదని తెలిపారు. వీరంతా పార్లమెంట్లో అలజడి ఘటనకు ముందు గురుగ్రామ్లోని లలిత్ ఝా ఇంట్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఐదుగురిని పోలీసులు అరెస్టు చేయగా.. మరొకరి కోసం గాలిస్తున్నారు.
తమ ఆరుగురికి నాలుగేండ్ల నుంచే ఆన్లైన్లో పరిచయం ఉన్నదని విచారణలో అమోల్ షిండే వెల్లడించినట్టు తెలిసింది. రైతుల ఆందోళనలు, మణిపూర్ సంక్షోభం, నిరుద్యోగం వంటి అంశాలతో తాము కలత చెందామని, అందుకే ఈ చర్యకు పాల్పడ్డామని చెప్పినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అమోల్ షిండే ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్ పాల్గొనేందుకని ఇంట్లో చెప్పి ఢిల్లీ వెళ్లాడని లాతూర్ జిల్లా పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు సాగర్ శర్మ, మనోరంజన్ ఆధార్ కార్డులతో సహా పోలీసులు పలు వివరాలు వెల్లడించారు. 42 ఏండ్ల నీలం దేవి ఉపాధ్యాయురాలు అని, ఆమె సివిల్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ ఉద్యమంలో ఆమె క్రియాశీలంగా పాల్గొన్నదని, అయితే ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని నీలం దేవి సోదరుడు రమ్నివాస్ పేర్కొన్నారు.
ఈ ఆరుగురు కొద్ది రోజుల క్రితమే ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తున్నది. సోషల్ మీడియా వేదికగా కాంటాక్టులో ఉండి ఈ కుట్ర చేశారని, తమ ప్లాన్లో భాగంగా పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్టు తెలిసింది. ఆరుగురు కూడా పార్లమెంట్ లోపలికి వెళ్లాలని ముందుగా ప్లాన్ వేసుకొన్నారు. అయితే ఇద్దరికి మాత్రమే పాస్లు దక్కాయి. ప్రస్తుతానికి ఈ ఘటనకు పాల్పడటంలో వారి ఉద్దేశం లేదా వారి వెనుక ఏదైనా ఉగ్ర సంస్థ ప్రోత్సాహం ఉన్నదా అనేది తెలియరాలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
తాజా ఘటన నేపథ్యంలో పార్లమెంట్ ప్రాంగణంలోకి విజిటర్ల ప్రవేశాన్ని నిషేధించారు. భద్రతా చర్యల్లో కూడా పలు కీలక మార్పులు చేస్తున్నారు. ఎయిర్పోర్టుల్లో ఉండే బాడీ స్కానర్ మెషీన్లను పార్లమెంట్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంట్లోకి ప్రవేశానికి ఎంపీలకు ఒక ప్రవేశ మార్గం, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేయనున్నట్టు సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి. విజిటర్లను మళ్లీ అనుమతించిన తర్వాత వారిని నాలుగో గేటు నుంచి లోపలికి అనుమతిస్తారు. తాజా ఘటనలో విజిటర్లుగా వచ్చిన దుండగులు గ్యాలరీ నుంచి లోక్సభ ప్రధాన మందిరంలోకి దూకిన నేపథ్యంలో ఆ గ్యాలరీని గ్లాస్ వర్క్తో వేరు చేయనున్నారు. అదేవిధంగా కార్యకలాపాల సమయంలో సభలో ఉండే భద్రతా సిబ్బందిని కూడా రెట్టింపు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మనోరంజన్ చాలా మంచివాడని అతడి తండ్రి దేవరాజే గౌడ అన్నారు. ‘ఎల్లప్పడూ సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనే ఆలోచిస్తాడు. స్వామి వివేకానంద పుస్తకాలు ఎక్కువగా చదువుతాడు. 2016లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన అతడు.. కొన్ని కంపెనీల్లో ఉద్యోగం చేసి ప్రస్తుతం పొలం పనులు చూసుకొంటున్నాడు’ అని దేవరాజే గౌడ తెలిపారు. మనోరంజన్ ఏదైనా తప్పు చేసి ఉంటే, అతను తన కొడుకు కాదని, కావాలంటే ఉరి తీయండి అని పేర్కొన్నారు.
బుధవారం స్పీకర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. భద్రతను పటిష్ఠం చేయటంపై కేంద్ర హోంశాఖకు సిఫారసు చేశారు. పార్లమెంట్లో భద్రతను చూసే సిబ్బంది కొరత ఉన్నదని ప్రతిపక్ష నేతలు లేవనెత్తారు. కొత్త పార్లమెంట్ భవనం గ్యాలరీలో భద్రతా సిబ్బంది పెద్దగా లేరని, సెక్యూరిటీ అవసరాల మార్పుల నేపథ్యంలో వారంతా వేర్వేరు చోట్ల విధుల్లో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్పెషల్ డైరెక్టర్(సెక్యూరిటీ) నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రేడ్-2 వరకు భద్రతా అధికారుల మంజూరు సంఖ్య 301 వరకు ఉండగా.. విధుల్లో ఉన్న వారి సంఖ్య 176గానే ఉన్నది. 125 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపాయి.
లోక్సభలో పొగ వదిలిన సాగర్ శర్మ, మనో రంజన్లకు మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా విజిటర్ పాస్లు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఆయన కార్యాలయం అభ్యర్థన మేరకు వారికి పాస్లు మంజూరు అయినట్టు సంబంధిత వర్గాలు కూడా ధ్రువీకరించాయి. దాడి తర్వాత స్వాధీనం చేసుకొన్న ఒక పాస్ ప్రతాప్ సింహా కార్యాలయం నుంచే జారీ అయినట్టు తేలిందని ఎంపీ డానిష్ అలీ పేర్కొన్నారు. కాగా, దీనిపై వివరణ ఇచ్చేందుకు తాను లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను కలుస్తానని ప్రతాప్ సింహా పేర్కొన్నారు. ప్రతాప్ సింహా కర్ణాటకలోని మైసూర్ నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరు నిందితుల పాస్ అభ్యర్థనలపై సంతకం చేసిన ఎంపీ ప్రతాప్ సింహాను విచారణ చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. భద్రతా ఉల్లంఘన ఘటనను ఉగ్రవాద చర్యగా ప్రకటించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
పొగ గొట్టాలు (గ్యాస్ క్యానిస్టర్స్) రిటైల్ మార్కెట్లలో అందరికీ సులభంగా అందుబాటులో ఉండే స్మోక్ క్యాన్లు లేదా స్మోక్ బాంబులే. వీటిని సైనిక కార్యకలాపాలతోపాటు పలు రకాల అవసరాల కోసం ఉపయోగిస్తారు. స్పోర్ట్స్ ఈవెంట్లు లేదా ఫొటోగ్రఫీ లాంటి అవసరాల కోసం సాధారణ పౌరులు సైతం వీటిని వినియోగిస్తారు. దట్టమైన పొగను విడుదల చేసే ఈ స్మోక్ బాంబులు ఫొటోషూట్లలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం లేదా సైనిక దాడుల్లో శత్రువుల కండ్లు గప్పేందుకు ఎంతో ఉపకరిస్తాయి.
భద్రతా వైఫల్యంపై లోక్సభ సెక్రటేరియట్ అభ్యర్థన మేరకు కేంద్ర హోంశాఖ దర్యాప్తునకు ఆదేశించింది. సీఆర్పీఎఫ్ డీజీ అనీశ్ సింగ్ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో ఇతర భద్రతా సంస్థల సభ్యులు, నిపుణులు ఉంటారని అధికార ప్రతినిధి తెలిపారు.