న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలకు లోక్సభ సెక్రటేరియేట్(Lok Sabha Secretariat) నోటీసులు ఇచ్చింది. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఆగస్టు 25వ తేదీన ఆ నోటీసులు జారీ చేశారు. లోక్సభ అనర్హత వేటు రూల్ 6 కింద ఆ నోటీసులు ఇచ్చారు. టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ఆ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ జూన్ 18వ తేదీన పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు త్రిపురకు చెందిన నేషనలిస్టు సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరినట్లు ప్రకటించారు. పార్లమెంట్లో ఆ గ్రూపును ఎన్సీపీఐగా ట్రీట్ చేస్తున్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ కార్యకలాపాల్లోనూ వారు పాల్గొన్నారు.
అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన అనర్హత పిటీషన్పై వాదనలు చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొన్నది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం కూడా 20 మంది ఎంపీలకు నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇవ్వడం సమస్య కాదు అని, నిర్ణీత సమయంలో కేసును పరిష్కరించాలని కోర్టు పేర్కొన్నది.
అభిషేక్ బెనర్జీ పిటీషన్లో ఉన్న ఎంపీల్లో కకోలి ఘోష్ బస్తీదార్, సుదీప్ బందోపాధ్యాయ, శతాబ్ధి రాయ్, ప్రసూన్ బెనర్జీ, రచనా బెనర్జీ, జగదీశ్ చంద్ర బర్మ బసునియా, పార్తా భౌమిక్, అరూప్ చక్రవర్తి, అధికారి దీపక్ దేవ్, సయ్యాని ఘోష్, బాపి హల్దార్, ఎండీ అబూ తాహిర్ ఖాన్, కలిపాదా సారెన్ ఖేర్వాల్, అసిత్ కుమార్ మాల్, జూనె మాలియా, మిట్టాలి బాగ్, ఖలీలు్ రెహ్మాన్, మాలా రాయ్, శర్మిలా సర్కార్, యూసుఫ్ పఠాన్ ఉన్నారు.