(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఎన్సీపీ నేత, లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్సభ సచివాలయం ఎత్తేసింది. ఫైజల్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గత జనవరి 13న జారీచేసిన అనర్హత నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంటున్నట్టు తెలిపింది. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం లోక్సభ సెకట్రేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనర్హత వ్యవహారం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారిన సమయంలో ఫైజల్పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్సభ సచివాలయం ఎత్తివేయడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకొన్నది. 2009 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ సలీహ్పై హత్యాయత్నానికి యత్నించారన్న కేసులో గత జనవరి 11న కవరత్తీ సెషన్స్ కోర్టు ఫైజల్ను దోషిగా తేల్చింది. పదేండ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే జనవరి 13న ఫైజల్పై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సచివాలయం నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై జనవరి 25న ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. సెషన్స్ కోర్టు తీర్పుపై హైకో ర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తనపై వేసిన అనర్హత వేటును రద్దుచేయాలని జనవరి 27న ఫైజల్ విజ్ఞప్తి చేసినప్పటికీ లోక్సభ సెక్రటేరియట్ పట్టించుకోలేదు. దీంతో ఫైజల్ సుప్రీంను ఆశ్రయించారు. మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు విచారిస్తుందనగా.. ఆయన లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్టు సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీచేసింది.
తనకు శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ హైకోర్టు స్టే విధించినా కూడా లోక్సభ సెక్రటేరియట్ తనపై అనర్హత వేటును కొనసాగిస్తున్నదని, దీనిపై తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ ఫైజల్ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతీరోజూ పార్లమెంట్కు వెళ్లినా.. అక్కడి భద్రతా సిబ్బంది తనను లోపలికి అనుమతించట్లేదని వాపోయారు. తనకు పడిన శిక్షపై కేరళ హైకోర్టు స్టే ఇచ్చిందని ఈ సందర్భంగా పిటిషన్లో గుర్తుచేశారు. కాబట్టి, తనపై విధించిన అనర్హత వేటును ఎత్తేసేలా ఆదేశాలు ఇవ్వాలని, దీనికోసం పిటిషన్ను వెంటనే విచారించాలని ధర్మాసనానికి విన్నవించారు. ఫైజల్ విజ్ఞప్తిని మన్నించిన అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఈ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణకు సిద్ధమవుతుందనగానే.. ఫైజల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో పిటిషన్ను కోర్టు పక్కనబెట్టింది.
ఎంపీగా తన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్సభ సెక్రటేరియట్ తీసుకొన్న నిర్ణయంపై ఫైజల్ స్పందించారు. తాజా నిర్ణయం కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అనర్హత వేటు విషయంలో ఓ ప్రోత్సాహకర సంకేతంగా అభివర్ణించారు. తన సభ్యత్వాన్ని రద్దు చేయడంలో చూపించిన వేగం.. పునరుద్ధరించడంలో చూపిస్తే బాగుండేదని చురకలు అంటించారు.