Lok Sabha Elections | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ 13న ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న 10 రోజుల్లో 12 రాష్ర్టాలు, యూటీల్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. 29కి పైగా సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సభలు 13నే ముగియనున్నాయి. మోదీ సభలు ముగిసిన రోజునే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడవచ్చని సోషల్మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.
లోక్సభతో పాటు వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇదివరకే ప్రకటించింది. అయినప్పటికీ, షెడ్యూల్ ప్రకటనపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో మోదీ పర్యటన కోసమే షెడ్యూల్ను నిలుపుదల చేశారంటూ సోషల్మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా 2019లో లోక్సభ ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం ఏడు దఫాల్లో పోలింగ్ నిర్వహించింది. మే 23న ఫలితాలు ప్రకటించింది.